122

🕌🕌🕌       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        🕌🕌🕌

🛐🛐   *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు*   🛐🛐
🤚🏻✋🏻     *అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను*      🤚🏻✋🏻

 *~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~* 

🕋🕋🕋             *ఇస్లాం చరిత్ర* *- 122*             🕋🕋🕋

☪🇸🇦☪ *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 37* ☪🇸🇦☪

 *■×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×=×■*

 *"వ అన్జిర్ అషీరతకల్ అఖ్'రబీన్" (ఓ ప్రవక్తా! నీ దగ్గరి బంధువుల్ని (దైవ శిక్ష గురించి) హెచ్చరించు* అనే దైవవాణి అవతరించిన తర్వాత దైవప్రవక్త (సల్లం) చేసిన మొట్టమొదటి పని, బనీ హాషిం తెగవారిని ఓ చోట సమావేశపరచి, దైవసందేశాన్ని వారి ముందు ఉంచడం.

ఇందులో భాగంగానే ఒక విందును కూడా ఏర్పాటు చేశారు. సమీప బంధువులందరు విందుకు హాజరయ్యారు. అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం, దైవసందేశాన్ని వారి ముందు ఉంచాల్సిన సమయం ఆసన్నమైంది.

విందు పూర్తయ్యాక దైవప్రవక్త (సల్లం) విషయం చెబుదామని లేచి నిలబడ్డారు. కాని అబూ లహబ్, దైవప్రవక్త (సల్లం) మాటలకు అడ్డుతగులుతూ, తన మాటలను వినిపించాడు.

“ముహమ్మద్ (సల్లం), చూడు! వీరంతా నీ పినతండ్రులు, పినతండ్రి కుమారులు. వీరితో మాట్లాడు. కాని మూర్ఖత్వం వదిలెయ్యి. నీ కుటుంబం అరబ్బులందరిని ఎదుర్కోలేదు సుమా! నిన్ను వారించడానికి వీరందరికంటే నాకే హక్కు అధికం. కాబట్టి నీ తండ్రి కుటుంబమే నిన్ను అడ్డుకోవడానికి చాలు. నీవే గనక నీ మాట మీదనే నిలబడతానంటే మాత్రం ఖురైష్ కు చెందిన తెగలన్నీ నీ పైకి వచ్చిపడతాయి. మిగతా అరబ్బులు కూడా వారికి సహాయపడతారు. తండ్రి కుటుంబాన్ని వినాశనానికి గురి చేయడానికి కారణభూతుడవు నీవే అవుతావు జాగ్రత్త!” అని ముగించాడు.

ప్రవక్త (స) మౌనాన్ని వహించారు. ఆ సమావేశంలో ఎలాంటి చర్చ జరుగలేదు. ఎన్నో విషయాలు చెప్పాలనుకున్న దైవప్రవక్త (సల్లం) ఏమీ చెప్పలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. కాని ఏనాటికైనా బంధువులు తన సందేశం విని సన్మార్గం అవలంభిస్తారన్న ఆశతో ఆయన (సల్లం) సహనం వహించారు.

ఆ తరువాత ప్రవక్త (సల్లం) మరోమారు బంధుమిత్రులందరినీ సమావేశపరచి, దైవసందేశాన్ని వినిపించాలని అనుకున్నారు. ఇందుకోసం కూడా మళ్ళీ విందును ఏర్పాటు చేశారు.

 *రెండవసారి ఏర్పాటు చేసిన విందులో జరిగిన మహత్యం : -* 

మళ్ళీ విందు చేయాలని నిర్ణయం తీసుకున్న తరువాత, దైవప్రవక్త (సల్లం) తనకు కొడుకులాంటి వాడైన అలీ (రజి)ని పిలిచి ఇలా చెప్పారు. “ఈ రాత్రి మనం ఒక ఉత్సవం జరుపుకోబోతున్నాం. పాలు, మాంసం ఇంకా ఇతర ఆహార పదార్థాలు సిద్ధం చేయి. మన బంధువులందరికీ నా తరఫున విందు ఆహ్వానాన్ని అందజేయి. ఆ సందర్భంగానే అల్లాహ్ ఆజ్ఞను నేను వాళ్ళందరికీ వినిపిస్తాను.”

అలీ (రజి) వెనువెంటనే విందు ఏర్పాట్లలో నిమగ్నులయ్యారు. కాని లోలోపల అలీ (రజి) ఆశ్చర్యంగా ఉంది. కారణం, "ముహమ్మద్ (సల్లం) తనకు అప్పజెప్పిన అతి కొద్ది మాంసం, ఒక గ్లాసుడు పాలు నలభై మంది ఖురైషి తెగ వాళ్ళకు ఎలా సరిపోతాయా?" అని.

 *బంధువులందరి రాక : -* 

ఆహ్వానించిన బంధువులందరూ విందుకు విచ్చేసారు. నలభై మంది దాకా వచ్చారు. అబూ తాలిబ్, అబూ సుఫియాన్ తో పాటు అబ్బాస్, హమ్జా కూడా వచ్చారు. మెత్తని దిండ్ల మీద అందరూ కూర్చోగా, అలీ (రజి) పళ్ళెంలో మాంసం తీసుకుని వచ్చి మధ్యలో పెట్టారు. ఆకలిగా ఉన్న బంధుమిత్రులంతా తమకు తామే వడ్డించుకోసాగారు. అలీ (రజి) తన కళ్ళను తానే నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఎంత తిన్నా, మాంసంకూర ఏ మాత్రం అయిపోతున్నట్లులేదు, ఆశ్చర్యపోయిన అలీ (రజి) దాని గురించి ఏదో మాట్లాడబోయి తల పైకెత్తి ముహమ్మద్ (సల్లం)ను చూశారు. ప్రవక్త (సల్లం), అలీ (రజి)నే చూస్తూ నవ్వుతూ ఉన్నారు.

అతిథులంతా విందు పూర్తి చేసుకుని హాయిగా, నెమ్మదిగా ఒకరినొకరు మాట్లాడుకోసాగారు. ప్రవక్త (సల్లం) వారందరి దృష్టిని తన వైపుకు మరలించుకున్నారు. దైవప్రవక్తగా తన మీదున్న ప్రత్యేకమైన బాధ్యత గురించి చెప్పటం ప్రారంభించారు.

“స్తోత్రమంతా అల్లాహ్ కే. నేను ఆయనను స్తుతిస్తున్నాను. ఆయన సహాయాన్ని కోరుకుంటున్నాను. ఆయనను విశ్వసిస్తున్నాను. ఆయననే నమ్ముకుంటున్నాను. అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడెవడూ లేడని సాక్ష్యమిస్తున్నాను. ఆయన ఒక్కడే. ఆయనకు సాటి ఎవ్వరూ లేరు. మార్గం చూపేవాడు తన ఇంటి వారితో ఎన్నడూ అసత్యం పలుకలేడు. ఆరాధనలకు ఎవ్వరూ సాటిలేని ఆ దైవసాక్షిగా చెబుతున్నాను, ఈ మానవాళి కోసం అల్లాహ్ తరఫున పంపబడిన ప్రవక్తను నేను. దైవసాక్షి! మీరు పడుకొని నిద్రబోయినట్లే మరణాన్ని కూడా ఎదుర్కోవలసి ఉంది. ఎలా నిద్ర నుండి మేల్కొంటారో తిరిగి మళ్ళీ లేపబడతారు. తదుపరి మీరు చేసే ప్రతి కర్మకు లెక్క అడగబడుతుంది. ఆ తరువాత స్వర్గమో లేదా నరకమో శాశ్వతంగా మీ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి.”

 *ఇది విన్న దైవప్రవక్త (సల్లం) గారి పెదనాన్న "అబూ తాలిబ్" ఇలా పలికారు....,* 

అబూ తాలిబ్ : - కుమారా! నీతో ఎంత మట్టుకు సహకరించగలమో, నీ నీతి బోధ ఎంత వరకు సమ్మతమైనదో, నీ మాట ఎంత వరకు సత్యమైందన్న విషయాన్ని అడగకు!
                   చూడు! నీ తండ్రి కుటుంబ సభ్యులంతా ఇక్కడనే చేరి ఉన్నారు. నేను కూడా వారిలోని ఓ వ్యక్తినే. తేడా ఏమిటంటే, నీ ఇష్ట పరిపూర్తికి వారందరికంటే ముందున్న వాణ్ణి. కాబట్టి నీకు ఏ ఆదేశమైతే వచ్చిందో దాన్ని నిర్వర్తించు. దైవసాక్షి! నేను నిన్ను సతతం కాపాడుతూ సహాయపడతాను. అయితే, నా మనస్సు అబ్దుల్ ముత్తలిబ్ ధర్మాన్ని వీడడానికి ఒప్పుకోవడం లేదు.

 *దైవప్రవక్త (సల్లం)గారి మరో పెదనాన్న "అబూ లహబ్" అందుకొని....,* 

అబూ లహబ్ : - దైవసాక్షి! ఇది బహు చెడ్డ విషయం. ఇతరులు అడ్డుకోక పూర్వమే నీవు అతణ్ణి అడ్డుకో.

అబూ తాలిబ్ : - దైవసాక్షిగా చెబుతున్నాను, నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నేను ఆయన (సల్లం)ను రక్షిస్తూనే ఉంటాను.

తన సోదరుని ఈ మాటలు విన్న అబూ లహబ్, తనకు వస్తున్న కోపాన్ని అణుచుకోలేక, కక్కలేక, మింగలేక విలవిల లాడిపోయాడు.

 *మరొక ఉల్లేఖనం ప్రకారం : - ↓* 

విందు పూర్తయిన తరువాత మహానీయ ముహమ్మద్ (సల్లం), తన ప్రసంగాన్ని ఇలా వినిపించారు.

●నా ప్రియ బంధువులారా! నా గురించి నా బాల్యం నుండి మీ అందరికీ తెలుసు. నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ అబద్ధమాడనని కూడా మీకు తెలుసు. ఇప్పుడు కూడా నేను నిజమే చెబుతున్నాను. దైవసాక్షిగా చెబుతున్నాను, నేను దేవుని ప్రవక్తను. దేవుడు, నన్ను తన ప్రవక్తగా నియమించి మీ దగ్గరకు పంపాడు. నేను మీ దగ్గరకు సత్య ధర్మం తీసుకొచ్చాను. మీకోసం ఇంతకంటే గొప్ప సందేశం, పూర్వం అరేబియాలో ఎవరూ తీసుకురాలేదు. నేను మీ దగ్గరకు ఉభయ లోకాల శ్రేయస్సు తెచ్చాను. దేవుడు మిమ్మల్ని, తన మార్గం వైపు పిలవమని నన్ను ఆదేశించాడు. నేను మీ సహకారం కోరుతున్నాను. మరి ఈ మహాకార్యంలో నాకు తోడ్పడే వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? నా తదనంతరం కూడా ఈ పనిని నిర్విఘ్నంగా కొనసాగించే వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా?

దైవప్రవక్త (సల్లం) ఇలా మాట్లాడిన తరువాత అందరినీ ఓసారి కలియజూశారు. ఎవరి అంతరాత్మ విశ్వాసం వైపు మొగ్గుతుందో, ఎవరి హృదయకవాటాలు ఇస్లాం జ్యోతి కోసం తెరుచుకుంటాయో, ఎవరు ధర్మసంస్థాపన కోసం నడుం బిగించి ముందుకొస్తారో అని ఆయన (సల్లం) ఎదురుచూడసాగారు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి.●

దైవప్రవక్త (సల్లం) అందజేసిన ఈ దైవసందేశం వైపు నడిచేందుకు ఏ ఒక్కరు కూడా సుముఖత చూపలేదు. బంధువులందరూ ముఖం తిప్పుకున్నారు. తమ ఇళ్ళకు బయలుదేరేందుకు అందరూ సన్నద్ధమవ్వసాగారు.

ఇబ్బందికరమైన ఆ నిశ్శబ్ద వాతావరణంలో, దైవప్రవక్త (సల్లం)గారి పెదనాన్న "అబూ తాలిబ్" కుమారుడు అలీ (రజి) ముందుకు వచ్చి, ప్రవక్త (సల్లం) పక్కన నిల్చుని...., *“దైవప్రవక్త! నేనుంటాను. మీ సహచరుడిగా మీ సహాయకుడిగా, మీరు చేపట్టే ఈ కార్యంలో.”* అన్నారు.

ప్రవక్త (సల్లం), అలీ (రజి) తల మీద చేతిని ఉంచి అక్కున చేర్చుకున్నారు.

 _(అప్పటికి అలీ (రజి) వయస్సు పన్నెండు సంవత్సరాలు మాత్రమే. అలీ (రజి) చూడటానికి పెద్ద ఆకర్షణీయంగా ఉండరు. పొట్టిగా, బక్కపల్చగా కనిపిస్తారు.)_ 

"పన్నెండేళ్ళ పిల్లవాడు, ఆయన (సల్లం)గారు చేపట్టే మహాకార్యంలో సహాయపడతాడంట!" అని, విందుకు వచ్చిన బంధువులంతా హాస్యాస్పదంగా మాట్లాడుకోసాగారు.

వెటకారంగా నవ్వుతూ గుంపులో నుంచి ఎవరో అబూ తాలిబ్ తో “నీ తమ్ముని కొడుకు చెప్పినదాన్ని నువ్వు సమ్మతిస్తున్నావా?” అని అన్నారు.

ఆ మాటలు విన్న అబూ తాలిబ్ బాధపడ్డారు. సుఫియాన్, హమ్జా కి మాత్రం నవ్వు ఆగడం లేదు. నవ్వుతూనే, వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు. ప్రవక్త (సల్లం) చెప్పిన చివరి వాక్యాలు వాళ్ళందరికీ ఆ తర్వాతి కాలంలో పదే పదే గుర్తుకు వచ్చాయి.

తను చెప్పదలచుకున్న సందేశాన్ని ముహమ్మద్ (సల్లం) ఖురైష్ తెగ వాళ్ళకు చెప్పలేకపోయారు. అయినా కూడా మరోసారి ప్రయత్నిద్దామనుకున్నారు. ఈ సారి ఆయన (సల్లం) ఎంతో స్పష్టంగా చెప్పాలనుకున్నారు. ఇదంతా ఏదో కలో లేక కథో కాదని, ఒకే ఒక్కడైన అల్లాహ్ ఇచ్చిన నిజమైన బహిరంగ సందేశమనీ, విగ్రహారాధన నుంచి, దుష్ట సంప్రదాయాల నుంచి ప్రజలు తమ జీవనశైలిని మార్చుకోవాలనీ, ఆలస్యం కాక ముందే తమలో పరివర్తన తెచ్చుకోవాలని ముహమ్మద్ (సల్లం) వారికి చివరి హెచ్చరిక చేయాలనుకున్నారు.

తను చెప్పాలనుకున్నది ప్రజలకు తెలియజెప్పడానికి ఇక ఆయన (సల్లం)కు తెలిసిన మార్గం ఒకే ఒక్కటి మిగిలి ఉంది. అదే *"సఫా"* కొండను అధిరోహించి, దైవసందేశాన్ని ప్రజలకు చాటిచెప్పడం.

Insha Allah రేపటి భాగములో.....,

✍🏻✍🏻     *®@£€€q* *+97433572282*      ✍🏻✍🏻
                    *(rafeeq)* 

✍🏻✍🏻      *Salman*       *+919700067779* ✍🏻✍🏻

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

No comments:

Post a Comment